కాంగ్రెస్​లో చేరిన ఆరుగురు బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీలు

  • 24 days ago
Six BRS MLCs Joined Congress in Telangana : బీఆర్​ఎస్​కు భారీ దెబ్బ తగిలింది. గురువారం అర్ధరాత్రి ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు ఒకేసారి కాంగ్రెస్‌లో చేరడం సంచలనం రేపింది. ఎక్కడా కూడా హడావుడి లేకుండా, ఎలాంటి ముందస్తు ఊహాగానాలకు తావివ్వకుండా ఎమ్మెల్సీల చేరిక జరిగింది. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో వారంతా కాంగ్రెస్‌ కండువాలు కప్పుకొన్నారు. ఆ సమయంలో సీఎం రేవంత్​తో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాసు మున్షీ, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డిలు ఉన్నారు.

బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, భాను ప్రసాద్, దండె విఠల్, ఎం.ఎస్‌ ప్రభాకర్, యెగ్గె మల్లేశం, బుగ్గారపు దయానంద్‌ పార్టీ మారారు. గురువారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌ సమావేశమైన వారు రాత్రి 12 గంటల సమయంలో జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్‌రెడ్డి నివాసానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి హస్తిన పర్యటన ముగించుకుని ఇంటికి చేరుకోగానే వారు పార్టీలో చేరారు. సీఎం దిల్లీ నుంచి వచ్చిన నిమిషాల్లోనే చేరికల కార్యక్రమం చకచకా పూర్తయింది.

Recommended